* రూ.18 లక్షల నిధులతో తరగతి గదులు నిర్మించిన దర్శకుడు
* గతంలోనూ రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సుకుమార్
మలికిపురం,(ADITYA9NEWS): మనం ఎంత ఎత్తు ఎదిగామన్నది కాదు, ఎదిగిన తరువాత కన్న తల్లిని, పుట్టిన ఊరిని మరచిపోనప్పుడే ఎదిగిన ఎత్తుకు పరమార్థం. అలాంటి కోవలో మరో ఆణిముత్యంగా నిలుస్తున్నాడు సినీ దిగ్గజ దర్శకుడు సుకుమార్. స్నేహితుల ద్వారా ఊరి సమస్యలను తెలుసుకుని తన వంతు సాయం అందిస్తున్నాడు. ప్రజలకు చేయూతగా నిలుస్తున్నాడు ఈ టాలివుడ్ స్టార్ డైరక్టర్. ఆవివరాలెంటో చూద్దాం.
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు గ్రామంలో విద్యార్థుల సౌకర్యార్ధం దర్శకుడు సుకుమార్ తన తండ్రి బండ్రేడ్డి జ్ఞాపకార్థం బండ్రేడ్డి తిరుపతి రావు నాయుడు జ్ఞాపకార్థం 18 లక్షల రూపాయల విరాళంతో నిర్మించిన రెండు తరగతి గదులను ఆదివారం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు,దర్శకుడు సుకుమార్ దంపతులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ తన సొంత గ్రామంతో పాటు, ప్రజల అభిమానం వల్లే తాను ఇంతటివాడినయ్యానని గుర్తచేశారు. సమాజం తనను ఉన్నత స్థాయికి చేర్చినందునే వారికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో గ్రామంలో పేద ప్రజలకు ఆర్థిక సహాయం తో పాటు,రూ 40 లక్షల వ్యయంతో రాజోలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన సుకుమార్ ను, ఆదర్శంగా తీసుకోవాలని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ, రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి పలువురు పాల్గొన్నారు.