సుప్రీంలో రేపు ఓటుకు నోటు కేసు విచారణ : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
_ఓటుకు నోటు కేసుపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది
జై తెలంగాణ న్యూస్ _ హైదరాబాద్
ఓటుకు నోటు కేసుపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనున్నదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. 2015లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికారని చెప్పారు. దీంతో చంద్రబాబు 2017లో సుప్రీం కోర్టు లో కేసు వేశారని గుర్తుచేశారు. ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు ఏమి న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
ఓటుకు నోటు కేసు లో తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదని, అందుకే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి మత్తయ్య, సెబాస్టియన్ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారన్నారు. ఇన్ని కేసులున్నా చంద్రబాబు సిగ్గు, లజ్జా లేకుండా బుకాయిస్తున్నారని, ఏడేళ్ళయినా చిన్న కారణాలతో కేసును సాగదీస్తున్నారని విమర్శించారు.
రెడ్ హ్యాండెడ్గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారని, నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణకు సీఎం అయ్యారని, నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటుకు సంబంధించి అయిదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయని తెలిపారు.