అమరావతి,(ADITYA9NEWS): ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించి కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ఇంకా అదుపులోకి రాలేదని.సత్ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యంగా కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు ఆర్థికసాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కర్ఫ్యూ సడలింపులను తగ్గించాలన్న సూచించిన అధికారులకు కేవలం కర్ఫ్యూ విధించి 10 రోజులే కదా అయింది, చూద్దామంటూ వారికి జగన్ సమాధానమిచ్చారు.