*యూఎస్ వెళ్లే టిక్కెట్టు ధర రూ.2.20 లక్షలు
హైదరబాద్, (ADITYA9NEWS): కోవిడ్ పుణ్యమా అని మాములు వస్తువుల ధరలే తారెక్కిస్తుంటే తాజాగా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులకు టిక్కెట్టు ధరలు విమానం మోత మోగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా అమెరికా వెళ్లే వారికి మాత్రం పెద్ద షాక్ తగిలింది. రూ.90 వేలు ఉన్న టిక్కెట్టు ధర ఇప్పుడొక్కసారిగా రూ. రూ.2.20 లక్షలకు చేరింది. విద్య కోసం యుఎస్ వెళ్లే వారికి ఇది శరాఘాతంగా పరిణమించింది.
కరోనా పరిస్థితులతో పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండటం,మన దేశం నుంచి ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం దీనికి ప్రధాన కారణంగా ఉంది.కొవిడ్ వైరస్ రెండో దశ విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికా నుంచి మాత్రం విమానాల రాకపోకలు సాగుతున్నాయి. ఆ దేశ పౌరులు, విద్యార్థి వీసా ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తోంది అమెరికా.
కరోనా రెండో దశ తీవ్రత తగ్గుముఖం పట్టటంతో దిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని కాన్సులేట్ కార్యాలయాలను గడిచిన నెల నుంచి తెరిచింది. ఈ నెల చివరి వారం, ఆగస్టులో అక్కడి విశ్వవిద్యాలయాల్లో తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థి వీసాలను మాత్రమే జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలకు స్లాట్లను విడుదల చేసింది. హైదరాబాద్లో స్లాట్లు లభించని తెలుగు విద్యార్థులు దిల్లీ, ముంబయిలలో ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారు. ఆ విద్యార్థులంతా అమెరికా వెళ్లేందుకు సన్నద్ధమవుతుండటంతో విమాన టికెట్లకు గిరాకీ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో యుఎస్కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్యా తక్కువగా ఉండటంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లేందుకు రూ.60 వేలుగా ఉండే ఎకానమీ తరగతి టికెట్ ధర ప్రస్తుతం రూ.90 వేల నుంచి రూ.2.20లక్షల వరకూ ఉంది. అమెరికన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, ఖతార్ ఎయిర్లైన్స్లో ఎయిర్ ఇండియా నడుపుతున్న విమానాల్లో మాత్రమే టికెట్ ధర కొంచెం తక్కువగా రూ.90 వేలు ఉంది.