ఏపీ లో విశాఖకు సినీ గ్లామర్ తోడు కానుంది .ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన సినీ ప్రముఖుల బృందానికి తీపికబురు అందింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మాట్లాడుతూ “మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని జులై 15 నుంచి ఏపీలో సినిమా చిత్రీకరణలకు అనుమతిస్తామని జగన్ చెప్పారు. లాక్డౌన్లో థియేటర్లు మూతపడినందు వల్ల వాటి నుంచి వసూలు చేస్తున్న కనీస స్థిర విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని, నంది అవార్డుల బహూకరణ ఉత్సవాలను పునరుద్ధరించాలని కోరాం. 2019-20 నుంచి అవార్డులు ఇస్తామని సీఎం చెప్పారు. సినిమా టికెట్ల విక్రయంలో పారదర్శకత ఉండాలని అడిగాం. అధికారులతో చర్చించి దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. చెన్నై, ముంబయి, బెంగళూరు నగరాల్లో మాదిరిగా టికెట్ల విషయంలో ఫ్లెక్సీ ధరల విధానం అమలు చేయాలని విన్నవించాం. ఫ్లెక్సీ టికెట్ ధరల విధానం సినీ పరిశ్రమకు లాభదాయకంగా ఉంటుంది. దీని వల్ల టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఉండదు. రాజశేఖర్రెడ్డి హయాంలో 300 ఎకరాలకు పైగా సినిమా పరిశ్రమకు ఇచ్చారు. ఆ భూమిని అభివృద్ధి చేయాలని సీఎంను కోరాం. విశాఖలో స్టూడియోలు, అవుట్ డోర్ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారిని ప్రోత్సహిస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీనివల్ల విశాఖ కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశం ఉంది. ఈ సమావేశం మాకు సంతృప్తినిచ్చిందని వారు చెప్పారు
