దొంగ రికార్డుల‌తో భూములు కాజేయ‌లేరు : సీఎం జ‌గ‌న్

22 నుండి అన్ని జిల్లాల్లో భూ స‌ర్వే

(కృష్ణాజిల్లా): దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ‘భూ హక్కు- భూ రక్ష’ పథకానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ స్ప‌ష్టం చేశారు. వైఎస్సార్‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 16 వేల మంది సర్వేయర్లతో భూ రీసర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వేయర్లందరికీ అత్యాధునిక టెక్నాలజీతో సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణా అందించామన్నారు.

‘భూములపై వివాదాలు, సృష్టించే బ్రోకర్లు, రౌడీల నుంచి రక్షణ అవసరం. పాదయాత్రలో అనేకమంది బాధితుల కష్టాలు విన్నాన‌ని , సూమారు వందేళ్ల తర్వాత మళ్లీ సమగ్ర భూ సర్వే చేపడుతున్నాం. మీ భూమి రక్షణకు.. మా ప్రభుత్వం రక్షణ ఇస్తుందని జ‌గ‌న్ వివ‌రించారు.

రాష్ట్రంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన భూ రీస‌ర్వేపై ఎల్లోమీడియావి త‌ప్పుడురాత‌ల‌ని, అభివృద్ధికి అడుగ‌డుగునా ఆటంకాలు క‌లిగిస్తున్నార‌ని ఆరోపించారు. వాటిని ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌న్న‌ జ‌గ‌న్ మీ భూమి హక్కును ఎవరూ మార్చలేరు. రైతులకు మరింత భద్రత కలగాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ హామీతో కూడిన భూహక్కు పత్రాన్ని యజమానికి అందిస్తాం అని రైతులు, భూ య‌జమానులుద్ధేశించి మాట్లాడారు. భూమి విస్తీర్ణంతో కూడిన ల్యాండ్‌ మ్యాప్‌ను కూడా అందిస్తాం. ప్రతి గ్రామానికి సర్వే మ్యాప్‌ ఉంటుంది. గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామ‌ని సీఎం అన్నారు.

పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఇప్పటికే తక్కెళ్లపాడులో భూ రీసర్వే చేశాం. భూ రీసర్వే కోసం అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ నిధులతోనే సర్వే రాళ్లను కూడా వేస్తారు. ప్రతి భూమికి ఐడీ నంబర్‌ ఇస్తామ‌ని సీఎం జగన్ అన్నారు. డ్రోన్‌, రోవర్‌ ద్వారా అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సర్వే. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సక్రమంగా చేస్తాం. 2023 నాటికి భూ రీసర్వే పూర్తి చేస్తాం. దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలబడుతుంది.’ అని పేర్కొన్నారు.

కాగా ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది.మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. మొదటి దశలో 5వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్